Site icon HashtagU Telugu

Dasara Celebrations : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. వేకువ జాము నుంచే అందరికీ సర్వదర్శనం

Dasara Celebrations

Dasara Celebrations

Dasara Celebrations : విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా, ఏడవ రోజైన బుధవారం కనకదుర్గమ్మను సరస్వతీ దేవి అలంకారంలో భక్తులు దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నేడు అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం సందర్భం కావడంతో, భక్తులు ఈ ప్రత్యేక ఆలంకారాన్ని దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించేందుకు కంపార్ట్‌మెంట్లలో ఉంచి, క్యూలో పంపిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా దిగువకు పంపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ భక్తుడికీ ఆలయ సిబ్బంది ఉచితంగా ఒక లడ్డూ అందిస్తున్నారు.

ఈ రోజు టికెట్ దర్శనాలను రద్దు చేసి, వేకువ జామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ రోజు రెండు లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేయిస్తున్నారు.

మూలా నక్షత్రం విశిష్టత:

మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడం విశేషం. ఈ రోజు, మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి శక్తి స్వరూపాలను స్మరించుకుని, దుష్ట సంహారం చేసిన తరువాత, దుర్గామాతను శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తిగా సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీ దేవిని దర్శించడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహాన్ని పొందుతూ, అన్ని విద్యల్లో ప్రావీణ్యత సాధించవచ్చని భక్తులు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్సవాలు భక్తుల ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు, వారి జీవితాలలో సౌభాగ్యం తీసుకురావాలని ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుమార్తె ఆద్యతో కలిసి బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించారు. ఆలయ ప్రాంగణంలో అధికారులచే జనసేన పార్టీకి ప్రత్యేక స్వాగతం పలికి, వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత, పవన్ కళ్యాణ్ ఆలయానికి వెళ్లి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు, రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ కూడా ఈ సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్నారు.