Delhi team: ఢిల్లీ జట్టుకు గుడ్ న్యూస్

ఐపీఎల్ 15వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది .

Published By: HashtagU Telugu Desk
Delhi Capitals

Delhi Capitals

ఐపీఎల్ 15వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది . అయితే గుజరాత్ టైటాన్స్‌ తో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పలువురు కీలక విదేశీ ఆటగాళ్లు లేకపోవడం కూడా ఈ ఓటముకిక ఒక కారణం. అన్రిచ్ నోర్జే , డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లు ఆరంభమ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌ బలహీన పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. అన్రిచ్ నార్ట్జే, వార్నర్‌, మార్ష్‌ త్వరలోనే జట్టులో చేరనున్నట్లు తెలిపాడు.

ఢిల్లీ జట్టుకు ఐపీఎల్ లో కీలకంగా ఉన్న నోర్జే వెన్ను నొప్పి కారణంగా గతేడాది టీ 20 ప్రపంచకప్‌ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్‌ కల్లా అతను కోలుకుంటాడని భావించి అతనిని మళ్లీ రిటైన్‌ చేసుకుంది. నోర్జే ప్రాక్టీస్‌లో పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ చేస్తున్నాడనీ, అతనికి మరింత ప్రాక్టీస్‌ అవసరమనీ పాంటింగ్ చెప్పాడు. తమ తర్వాతి మ్యాచ్‌కు నోర్జే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని చెప్పుకొచ్చాడు. మరోవైపు స్టార్ ఓపెనర్ వార్నర్ ఇప్పటికే ముంబై చేరుకోగా…మిచెల్ మార్ష్ క్వారంటైన్ కూడా ముగిసింది. దీంతో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కు నార్జ్టే, వార్నర్‌ అందుబాటులో ఉండవచ్చు. అయితే గాయంతో బాధపడుతోన్న మార్ష్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.ఏప్రిల్ 10న జరిగే మ్యాచ్‌కు మార్ష్ అందుబాటులో ఉంటాడని పాంటింగ్ తెలిపాడు. మొత్తం మీద ఈ ముగ్గురి ఎంట్రీ తో ఢిల్లీ బలం మరింత పెరిగిందని చెప్పొచ్చు.

  Last Updated: 04 Apr 2022, 12:51 PM IST