పండుగ సీజన్ కావడంతో డిజిటల్ లావాదేవీ యాప్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు వాడుకునే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని SBI సూచించింది. సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. దీని కోసం 18001-2-3-4 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించింది.
దేశంలో ఇటీవల సైబర్ క్రైమ్, డిజిటల్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు సైబర్ మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తమ ఖాతాల్లో ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల కస్టమర్లకు సూచించింది. “అనధికార లావాదేవీలు ఏవైనా ఉంటే వెంటనే టోల్-ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలని, తద్వారా సకాలంలో సరైన చర్యలు తీసుకోవచ్చు” అని SBI ఇటీవల ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
గత నెలలో SBI చైర్మన్ దినేష్ కుమార్ కూడా సైబర్ మోసాల పట్ల కస్టమర్లకు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. టోల్-ఫ్రీ నంబర్ను డయల్ చేయడంతో పాటు కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, మొబైల్ బ్యాంకింగ్, BHIM SBI పే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంక్ వెబ్సైట్ ద్వారా నమోదు చేయవచ్చని ఎస్బిఐ అధికారులు పేర్కొన్నారు. కస్టమర్ నుండి వచ్చిన ఫిర్యాదులను 90 రోజుల్లో పరిష్కరించబడతాయని SBI పేర్కొంది.