Venkaiah Naidu: గూగుల్ ఎప్పటికీ గురువును మించిపోలేదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఉన్న మేధాశక్తి ఉందని, అందుకే మళ్లీ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మళ్లీ తనను విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని తెలిపారు.
సోమవారం విశాఖ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ లలో కొంతమంది అపహస్య పనులు చేస్తున్నారు.. వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదన్నారు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు భూతులు మాట్లాడుతున్నారు. అటువంటి వారికి పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలన్నారు.
నేడు విలువలతో కూడిన విద్య తగ్గుతుంది..ఇది మంచిది కాదన్నారు. విలువలతో కూడిన విద్య ను అందించడానికి అందరూ కృషి చేయాలన్నారు. దేశంలో ఉన్న మేధాశక్తి వలన మరల ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందన్నారు. చదువు ఎంత ముఖ్యమో.. సంస్కారం కూడా అంతే ముఖ్యమన్నారు. మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదన్నారు. మాతృభాష కళ్ళు లాంటిది… పరాయి భాష కళ్లద్దాల వంటిదన్నారు. విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారని అన్నారు.