కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేసిన ఏపీ సర్కార్.. తాజాగా సచివాలయంలో కరోనా ఆంక్షలను సడలించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య, కార్యదర్శులంతా సచివాలయం నుంచి విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కొవిడ్-19 ఆంక్షలు ఎత్తివేసినందున తప్పనిసరిగా సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సిందిగా కార్యదర్శులకు సూచించారు.
ఉన్నతాధికారులు సైతం బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా హాజరు నమోదు చేయాలని వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని సమావేశాలకు ఇక నుంచి భౌతికంగానే హాజరు కావాలని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల మంత్రులు నిర్వహించే సమీక్షా సమావేశాలకు భౌతికంగానే హాజరు కావాల్సిందిగా సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు