తెల్ల బంగారం ధరలు పైపైకి పాకుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్లో పెరిగాయి. ఆదదోని కాటన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా పదివేల రూపాయలు దాటి, 10,759 రూపాయలు పలికింది.అసలు పత్తి ధర రోజు రోజుకీ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే.. పత్తి వ్యాపారుల మధ్య తీవ్రమై పోటీ నెలకొనడమే ప్రధాన కారణమని కాటన్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు.
అలాగే సీజన్ చివరి దశకు వచ్చిన నేపధ్యంలో, సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో పత్తి ధరలు ఓరేంజ్లో భారీగా పెరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్లో పలు కారణాల కారణంగా పంట దెబ్బతినడంతో ఈ సీజన్లో పత్తి దిగుబడులు బాగా తగ్గాయని, దీంతో అంతర్జాతీయంగా, కాటన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని, దీంతో పత్తికి ఊహాంచని విధంగా ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి పత్తి ధర పెరుగుతూ వస్తోంది.అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లకు, గింజలకు మంచి డిమాండ్ ఉండటంతో, వ్యాపారులు పోటీ పడి మరీ ఎంత ధరకైనా పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక్క నెల వ్యవధిలోనే క్వింటాల్ పత్తి 8,500 రూపాయల నుంచి 10 వేలు దాటడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే క్వింటా పత్తి ధర 11 వేలకు చేరే అవకాశం ఉందని ఉందని చెబుతున్నారు.ఇక ధరల పెరుగుదలతో కరువు ప్రాంతమైన రాయలసీమలోని రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. ఈ క్రమంలో పత్తికి రికార్డు స్థాయిలో భారీగా ధర పలుకుతుండడంతో సీమ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పండించే రైతులకు మంచి రోజులు వచ్చాయంటూ తెల్లబంగారాన్ని పండించే రైతులు మురిసిపోతున్నారు. ఏది ఏమైనా రైతులు ఊహించని ధర నమోదు కావడంతో నేటి వరకు పంటను దాచుకొన్న రైతులకు కాసుల వర్షం కురిపిస్తోందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.