దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం 122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 2020 నుండి జిల్లాలో 20,14,818 మందికి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా, 1,24,020 మందికి వైరస్ సోకింది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయంతో పాటు వైద్యబృందాలు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఆరా తీస్తున్నాయి. వివిధ దేశాల నుంచి 1024 మంది వ్యక్తులు వచ్చారు. వీరిలో 724 మంది ఐరోపా దేశాల నుంచి ప్రయాణించారు. ఓమిక్రాన్ నిర్ధారణ కోసం మొత్తం 420 నమూనాలను పంపారు.
ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించవద్దని జిల్లా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లపై కోవిడ్ భద్రతా నిబంధనలకు సంబంధించిన ప్రామాణిక మార్గదర్శకాలను జారీ చేశారు.