Mamata Banerjee : 2026లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంగా ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ, బెంగాల్లో కాంగ్రెస్కు ఎటువంటి స్థానం లేదని, తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీకి దిగుతుందని తేల్చిచెప్పారు.
Read Also: Rahul Gandhi: అకస్మాత్తుగా వరంగల్కు రాహుల్గాంధీ .. కారణం ఏమిటి ?
ఢిల్లీ ఎన్నికల విషయంలో ఆప్ , కాంగ్రెస్ మద్య వైరం కారణంగానే బీజేపీ గెలిచిందని చెప్పిన మమతా బెనర్జీ తన రాష్ట్రానికి వచ్చేసరికి అదే పంథా అవలంబించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహాయం చేయలేదని, అదే విధంగా హర్యానాలో కాంగ్రెస్కు ఆప్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పరస్పర సహకారం లేకపోవడం వల్లే బీజేపీ విజయం సాధించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వరుసగా నాలుగోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడం ఇండియా కూటమికి సవాలుగా మారిందని, అయితే పార్టీ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని మమతా సూచించారు. మమతా బెనర్జీ తాను 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని స్పష్టం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి పార్టీల ప్రకటనలు, విమర్శల వస్తున్న నేపథ్యంలో కూటమిపై కీలక ప్రకటన చేసింది. కేవలం లోక్సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని, అసెంబ్లీ ఎన్నికలకు కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ కూడా ఇదే విషయం చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకే కూటమి ఏర్పడిందన్నారు. అటు మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ, ఉద్ధవ్ ధాకరే శివసేన, కాంగ్రెస్ మధ్య సంబంధాలు చెడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఇండియా కూటమి నుంచి బయటకు రావాలని పరోక్షంగా సంకేతాలిచ్చింది. అదే జరిగితే ఇక ఇండియా కూటమి ఉనికి కోల్పోయినట్టే.