Mahabubnagar: రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. చివరకు పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటం చర్చనీయాంశమవుతోంది. వివాహేతర సంబంధాల కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఓ ఘటనలో కానిస్టేబల్ సీఐపై దాడి చేయడం కలకలం రేపింది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కానిస్టేబుల్ కత్తితో సీఐపై దాడి చేశారు.
ఈ దాడిలో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. సీఐని తోటి పోలీసులు, స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన స్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపుతోంది. సీఐ ఇఫ్తేకార్ పై కానిస్టేబుల్ జగదీష్ దాడికి పాల్పడ్డాడు. తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో అతడిపై దాడి చేశాడని తెలుస్తోంది.
ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం, హైదరాబాద్ నగరంలోని యశోద హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పౌరులను రక్షించాల్సిన పోలీసులు ఇలా వ్యవహరిస్తారా అంటూ సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.