జూన్ 30 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసే కుట్రతో భారత్ లోకి ప్రవేశించిన పాక్ ఉగ్రవాదులను భారత భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులని పోలీసులు వెల్లడించారు. వారి నుంచి కీలక ఆధారాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
శ్రీనగర్ లోని బెమీనా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మరణించిన వారిలో ఒకరిని అబ్దుల్లా గౌజ్రీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ వీరిని భారత్ కు పంపించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అమర్ననాథ్ యాత్రకు సంబంధించిన మార్గాల్లో భద్రతా బలగాలు గట్టిబందోబస్తును ఏర్పాటు చేశాయి.