Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి ఖమ్మం ముదిరాజుల మీటింగుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్,కార్పోరేటర్ దోరేపల్లి శ్వేత ఆధ్వర్యంలో కోణార్క్ హోటల్ లో గురువారం మధ్యాహ్నం ముదిరాజుల యువ ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు.
కాంగ్రెస్ వారికి బడుగు బలహీన వర్గాల వారంటే ఏ మాత్రం గౌరవం లేదని, మంత్రివర్గంలో ముస్లిం,మున్నూరుకాపు, యాదవ, పద్మశాలిలకు ప్రాతినిథ్యం లేదని మండిపడ్డారు. కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం తెచ్చి చెరువులు పునరుద్ధరించారు, ఉచితంగా చేప పిల్లల్ని అందజేశారని వద్దిరాజు గుర్తు చేశారు. చేపల ఉత్పత్తిని బాగా ప్రోత్సహించారని, బీఆర్ఎస్ ను బీసీల పార్టీగా నిర్మిద్దామని, బీసీ యువతకు,మహిళలకు అవకాశాలు బాగా పెరుగుతాయని, మనమందరం సైనికుల మాదిరిగా కష్టించి పని చేసి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం అని వద్దిరాజు అన్నారు.