వడోదరలో మత ఘర్షణలు చెలరేగాయి. దీపావళి వేడుకలు నిర్వహస్తున్న సమయంలో ఈ ఘర్షణలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు అనుమానితులను గుర్తించే పనిలో ఉన్నారు. నగరంలోని పానిగేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింసకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యస్పాల్ జగనియా అన్నారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు.. నగరం నలుమూలల నుండి సిబ్బందిని సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఆయన తెలిపారు. ఇంటి టెర్రస్ నుండి పోలీసులపై పెట్రోల్ బాంబు విసిరారు. ఈ విషయంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణ చెలరేగకముందే వీధి దీపాలు ఆపేశారని.. ఆ తర్వాత ఇరువర్గాల రాళ్లు రువ్వడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాల సమీపంలో బాణాసంచా పేల్చడంతో ఘర్షణ చోటుచేసుకుంది.