CM Revanth: స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రేవంత్ 2 లక్షల సాయం

  • Written By:
  • Updated On - December 30, 2023 / 05:17 PM IST

CM Revanth: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹2 లక్షల చెక్ ను ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు.

ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ₹2 లక్షలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ₹2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.