దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని ఆయన అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు ప్రసరింపజేయడమనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని దీపావళి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
బాణాసంచా వెలిగించే సందర్భంలో ప్రమాదాలకు గురికాకుండా, భక్తి శ్రద్ధలతో పర్యావరణహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ ఏడాది దివ్వకాంతుల నడుమ దీపావళి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈనెల 25న సూర్యగ్రహణం ఉండటంతో సోమవారమే దీపావళి జరుపుకోవాలని వేదపండితులు సూచిస్తున్నారు.