CM KCR: ఛాంపియన్లతో కేసీఆర్ లంచ్‌

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్‌ జరీన్, జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించిన షూటర్ ఇషాసింగ్‌లను తెలంగాణ సీఎం కేసీఆర్ సత్కరించారు.

  • Written By:
  • Publish Date - June 2, 2022 / 07:31 PM IST

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్‌ జరీన్, జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించిన షూటర్ ఇషాసింగ్‌లను తెలంగాణ సీఎం కేసీఆర్ సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర వేడుకల్లో ఇద్దరికీ 2 కోట్ల రూపాయల చొప్పున చెక్కులు అందజేసిన కేసీఆర్ అనంతరం నిఖత్, ఇషాలను ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్ ఇద్దరితో ఉత్సాహంగా ముచ్చటించారు.

బాక్సింగ్ పట్ల ఆసక్తి పెరగడానికి కారణాలను నిఖత్‌ను అడిగి తెలుసుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతోనే తాను బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నట్టు నిఖత్ సీఎంకు వివరించింది. శిక్షణతో పాటు అన్ని విధాలుగా తనకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిఖత్‌ కోరిక మేరకు ఆమెతో కలిసి సరదాగా బాక్సింగ్ పంచ్ ప్రాక్టీస్ చేశారు. అటు యువషూటర్ ఇషాసింగ్‌ను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. చిన్నతనంలోనే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న ఇషాను ప్రశంసలతో ముంచెత్తారు.

నిఖత్, ఇషా తల్లిదండ్రులను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిద్దడం సాధారణ విషయం కాదన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ వారితో చెప్పారు.