ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించడంతో, రాష్ట్రంలో విషాద చాయలు అలుముకున్నాయి. గౌతంరెడ్డి స్వస్థలమైన నెల్లూరు జిల్లాలో ఆయన మరణవార్త విన్న అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు మేకపాటి గౌతంరెడ్డి భౌతికకాయానికి నివాళ్ళులు అర్పించేందుకు, హైదరాబాద్లోని గౌతంరెడ్డి నివాసానికి తరలివస్తున్నారు.
ఇక తాజా మ్యాటర్ ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, మేకపాటి గౌతంరెడ్డి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. సీఎం జగన్ రాకతో మేకపాటి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మరోవైపు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యుల రోదనలను చూసి, జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో చెట్టంత కొడుకు మరణంతో తల్లడిల్లిపోతున్న గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహనరెడ్డిని జగన్ ఓదార్చారు. మరోవైపు వైఎస్ భారతి గౌతమ్ రెడ్డి తల్లి, సతీమణిని ఓదార్చారు. ఇక అమెరికాలో చదువుకుంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ వచ్చాక, బుధవారం అధికార లాంఛనాలతో నెల్లూరు జిల్లా, బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.