సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం రామప్ప ఆలయాన్ని సందర్శించిన సీజేఐ రమణకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆయన హనుమకొండలోని ఎన్ఐటీ అతిథిగృహంలో బస చేశారు.
ఆదివారం ఉదయం భద్రకాళి దేవాలయాన్ని దర్శించుకున్న ఎన్వీ రమణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన పది కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించారు.
నూతన భవన సముదాయం నిర్మాణంతో జిల్లా కోర్టులో అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 90 యేళ్ల కిందట నిజాంకాలంలో నిర్మించిన భవనాల్లోనే ఇప్పటివరకు వరంగల్ జిల్లా కోర్టులు నడుస్తూ వచ్చాయి. పెరిగిన అవరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త భవన సముదాయాన్ని నిర్మించారు.
మొత్తం 23కోట్ల 50లక్షల రూపాయలలో 21కోట్ల 65 లక్షలతో సువిశాలమైన భవన సముదాయాన్ని నిర్మించారు. కోటి వ్యయంతో పార్కింగ్, అంతర్గత సీసీ రోడ్లు, లాన్ను ఏర్పాటు చేశారు. మరో 65లక్షల రూపాయలతో కోర్టు ప్రాంగణంలోనే శిశు సంక్షేమ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. లక్షా 23వేల 980 చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు.