ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను నిరసిస్తూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ దీక్షకు దిగారు. ఇంటి గోడను కూల్చివేసిన ఘటనపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోడ కూల్చివేత, బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ `ఛలో నర్సీపట్నం` కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ దీక్షకు దిగారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో విజయ్ దీక్షకు కూర్చున్నారు. ఆయనకు సంఘీభావం తెలపడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి నర్సీపట్నం బయల్దేరిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం వెళ్లకుండా తణుకులో మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను, వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని హౌస్ అరెస్ట్ చేశారు.