నియంతృత్వానికి మారుపేరుగా నిలిచే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. బయటి ప్రపంచానికి ఎందుకు దూరంగా ఉంటున్నారో ఎట్టకేలకు తెలిసింది. ఆయన ఒక అంతు చిక్కని వ్యాధితో బాధ పడుతున్నారట. ‘సెరిబ్రల్ అనైర్య్సమ్’ అనే వ్యాధి కారణంగా ఆయన 2021 సంవత్సరం చివర్లోనే ఆస్పత్రిపాలు అయ్యారట. ఆ వ్యాధి సోకిన వారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ, షీ జిన్పింగ్ కేవలం సంప్రదాయ చైనా ఔషధాలు మాత్రమే వాడుతానని తేల్చి చెప్పారట. దీంతో ఆయనకు వ్యక్తిగత వైద్యులు చైనా సంప్రదాయ మందులే ఇస్తున్నారని సమాచారం. ఈ వ్యాధికి చికిత్స పొందుతుండటం వల్లే బయటి ప్రపంచానికి దూరంగా జిన్పింగ్ ఉంటున్నారని తెలుస్తోంది.
జిన్ పింగ్ అనారోగ్యానికి నిదర్శనాలివీ..
* రెండేళ్ల క్రితం కొవిడ్-19 మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలతో భేటీలను జీ జిన్పింగ్ దాటవేస్తూ వస్తున్నారు.
* అంతకుముందు 2019 మార్చిలో ఇటలీ పర్యటనలో నడవడానికి ఇబ్బంది పడ్డారని అంటారు.
* ఫ్రాన్స్లో పర్యటిస్తున్నప్పుడు కూర్చునేందుకు సహాయకుల మద్దతు తీసుకున్నారని సమాచారం.
* 2020లో షెన్జెన్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడేందుకు చాలా ఆలస్యంగా వచ్చారని చెబుతారు. మధ్యమధ్యలో దగ్గుతూ నెమ్మదిగా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
సెరిబ్రల్ అనౌర్య్సమ్ అంటే..
సెరిబ్రల్ అనౌర్య్సమ్ వ్యాధి మెదడుకు సంబంధించింది. దీని బారిన పడినవారి మెదడులోని రక్త నాళాలు ఉబ్బుతాయి. అనంతరం వాటి నుంచి రక్తం లీక్ అవుతూ ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన తలనొప్పి.. ఆ తర్వాత ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అనౌర్య్సమ్లోకి రక్తం సరఫరాను అడ్డుకునేందుకు విభిన్న పద్దతులు అవలంభిస్తారు. అనౌర్యసమ్లోకి అవసరానికి మించి రక్తం సరఫరా కాకుండా.. శస్త్ర చికిత్స చేసి దారి మళ్లిస్తారు.