తైవాన్ కు చైనా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ కు స్వాతంత్ర్యం కావాలంటే ఆ దేశం తీవ్రమైన పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. తైవాన్ తమ సొంత దేశంలోని భూభాగమేనంటూ చైనా.. స్వతంత్ర దేశంగా తైవాన్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలను పంపుతూ కవించే చర్యలకు పాల్పడుతోంది.
ఈ నేపథ్యంలోనే చైనా తైవాన్ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మా షియావోగ్వాంగ్ స్పందించారు. తైవాన్ ను శాంతియుత వాతావరణంలో చైనాలో కలిపేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, లేదూ తమకు స్వాతంత్ర్యం కావాలని తైవాన్ అలాగే మొండికేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కాగా, తైవాన్ వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే తైవాన్ మెయిన్ ల్యాండ్ అఫైర్స్ కౌన్సిల్ చైనాను అభ్యర్థించింది. తైవాన్ జలసంధిలో శాంతికి విఘాతం కలగకుండా చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమది స్వతంత్ర దేశమని ఇప్పటికే ప్రకటించింది. తమ స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేసింది. ఇటు అమెరికా కూడా తైవాన్ కు అండగా నిలిచింది.