దీపావళి సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు కానుకలు అందజేశారు. దీపావళి పండుగ సందర్భంగా తన నియోజకవర్గాల్లోని కుటుంబాలకు కానుకలు సమర్పించడంతోపాటు వినాయక చవితికి పూజల కోసం మట్టి విగ్రహాలను అందజేసే పద్ధతిని చెవిరెడ్డి పాటిస్తున్నారు. శుక్రవారం చంద్రగిరి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా చంద్రగిరి ప్రజలకు దీపావళి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని తన ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా వారికి అండగా ఉంటానని తెలిపారు. వారికి భరోసా ఇవ్వడమే కానుకల సమర్పణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంపీపీ హేమేంద్రకుమార్రెడ్డి, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.