NAAC : కేఎల్ వర్సిటీపై సీబీఐ కేసు

NAAC : సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి, ఈ అవినీతి వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేశారు

Published By: HashtagU Telugu Desk
Naac

Naac

స్వతంత్ర విద్యా సంస్థల ప్రమాణాలను అంచనా వేసే NAAC (National Assessment and Accreditation Council) రేటింగ్ కోసం లంచం తీసుకున్న వ్యవహారం వెలుగు చూసింది. సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి, ఈ అవినీతి వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేశారు. విజయవాడ, ఢిల్లీ సహా 20 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టి, అనేక ముఖ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో ఉన్న KL EF యూనివర్శిటీ ఈ అవినీతి వ్యవహారానికి కేంద్రంగా మారినట్లు సీబీఐ గుర్తించింది. NAAC రేటింగ్‌ను పెంచుకునేందుకు యూనివర్శిటీ యాజమాన్యం NAAC సభ్యులకు బహుమతుల రూపంలో లంచం అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో బంగారు నాణేలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లంచంగా ఇచ్చినట్లు వెల్లడైంది.

ఈ దాడుల సందర్భంగా సీబీఐ అధికారులు ₹37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. KL EF యూనివర్శిటీకి చెందిన JP శారథి వర్మ, కోనేరూ రాజా, ఏ. రామకృష్ణలతో పాటు NAAC కమిటీ చైర్మన్ సమరేంద్ర నాథ్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. లంచం తీసుకున్న ఇతర NAAC కమిటీ సభ్యులపై కూడా విచారణ కొనసాగుతోంది. NAAC అనేది భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రమాణాలను నిర్ణయించే అత్యున్నత సంస్థ. ఈ అవినీతి వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల రేటింగ్ విధానం పట్ల అనుమానాలు పెరిగాయి. లంచం ద్వారా విద్యాసంస్థలు మంచి రేటింగ్ తెచ్చుకోవడం విద్యా ప్రమాణాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలను సేకరించేందుకు సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. విద్యా రంగంలో అవినీతి పెరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

  Last Updated: 02 Feb 2025, 02:07 PM IST