ఐపీఎల్ 2022 సీజన్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత అద్భుత విజయంతో గెలుపు బాట పట్టింది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా ఈ సీజన్ ప్లేఆఫ్స్కి సన్రైజర్స్ హైదరాబాద్ చేరుకుంటుందా అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తెగ శోధిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లాడినసన్ రైజర్స్ హైదరాబాద్ టీం 6 మ్యాచుల్లో విజయం సాధించి.. 12 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.
ఈ సీజన్ లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే ఆడనుండగా.. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ విజయం సాధిస్తే ఆ జట్టు ఖాతాలో మొత్తం 14 పాయింట్లు చేరుతాయి. అయితే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ జట్టు 20 పాయింట్లతో ప్లే ఆప్స్ కి చేరగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు 16 పాయింట్లతో 2,3 స్థానాలో నిలిచాయి. ఇక మిగిలిన ఒక బెర్తు కోసం ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పోటీపడాల్సివుంటుంది.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ ప్లేఆఫ్స్కి అర్హత సాధించాలంటే .. ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరగనున్న తన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాదించాలి. అలానే ఢిల్లీ క్యాపిటల్స్ తన తదుపరి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా తర్వాత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవాలి. అలాగే ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్తో తన చివరి మ్యాచ్ని ఆడనున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు కూడాఓటమిపాలవ్వాలి. ఇవన్నీ జరిగితేనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్కి అర్హత సాధిస్తుంది.