Budda Venkanna: రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న.. ఎమ్మెల్యే పిన్నెల్లి పై ఫైర్..?

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 11:56 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్య టిడిపి నాయకులు ఆగ్రహానికి కారణం గా మారింది. టీడీపీ కార్యకర్త జల్లయ్య ను దారుణంగా మారణాయుధాలతో హతమార్చిన కఠినంగా శిక్షించాలి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే జల్లయ్య హత్య ఘటనను ఖండించిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని, హత్యలు చేయమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అంటూ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బుద్ధ వెంకన్న.

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే చనిపోయిన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బుద్ధ వెంకన్న బయలుదేరగా ఆయన పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో, వారి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకన్న రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పల్నాడులో రెచ్చిపోతున్న పిన్నెల్లిని బహిరంగంగానే ఎన్ కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేశారు. గతంలో తనపై కూడా పల్నాడులో హత్యాప్రయత్నం జరిగిందని, పల్నాడు లో పిన్నెల్లి అరాచకాలకు అంతులేకుండా పోతోంది అని ఆయన ఆరోపించారు.