BRS Minister: ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ప్రధానమంత్రి చేసిన పసుపు బోర్డు ప్రకటన కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమేమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Prashanth

Prashanth

BRS Minister: ఏర్గట్ల: బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో సుమారు 21 కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో వచ్చి బొట్టుపెట్టి ఆశీర్వదించారు. అబివృద్ధి ప్రదాత మంత్రి వేములకు మద్దతుగా ఉంటామని ఆయా గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. ఈ సందర్బంగా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన బీజేపీ మళ్ళీ పసుపు బోర్డు అని రైతులకు మోసపు మాటలు చెప్పడం దుర్మార్గమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి చేసిన పసుపు బోర్డు ప్రకటన కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమేమని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలనీ,మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు కోసం బిల్లు పెట్టలేదనీ బీజేపీ నీ ప్రశ్నించారు. పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారనీ మండిపడ్డారు. 1986 పార్లమెంట్ ద్వారా చట్టమైన స్పైస్ బోర్డులో భాగంగా ఉన్న పసుపుకు బోర్డు ఏర్పాటు చేయాలంటే ప్రత్యేక చట్టం చేయాలని ప్రధాని మోడీకి తెల్వదా అని నిలదీశారు.

మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారనీ,ఓట్ల కోసం ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా అంటూ ద్వజమెత్తారు. ఎద్దు ఎవుసం తెల్వని కాంగ్రెస్ ను,రైతును మోసం చేసే బీజేపీ ని నమ్మితే అరిగోసలు తప్పవని..తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఒకడేమో(బీజేపీ) మోటార్లకు మీటర్లు పెడతామని తిరుగుతున్నడు, ఒకడేమో(కాంగ్రెస్) గంటలో ఎకరం పరిస్తాం రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఇప్పుడు మోసపు హామీలతో వస్తున్న వారి చేతిలో గతంలో అందరం అరిగోస పడ్డవాల్లమే అది గుర్తు చేసుకోవాలని అన్నారు. కేసిఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలోనీ ప్రతి పల్లెలో కోట్ల రూపాయల అభివృద్ది చేశామని తెలిపారు. అన్ని రకాల సంక్షేమ పథకాలతో పల్లెలు అభివృద్ది పథంలో దూసుకెళ్తున్నయని అన్నారు.

Also Read: Muttiah Muralitharan: ‘800’ బయోపిక్ ను ఇండియాలోనే 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం: శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూ

  Last Updated: 02 Oct 2023, 05:54 PM IST