హైదరాబాద్లో పేకాట ఆడుతూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు పట్టుబడ్డారు. మేడిపల్లిలో భారత రాష్ట్ర సమితికి చెందిన 15 మంది నాయకులను, డిప్యూటీ మేయర్, ఆరుగురు కార్పొరేటర్లను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అరెస్టు చేసింది. పక్కా సమాచారంతో పోలీసులు పీర్జాదిగూడ మున్సిపల్ కో-ఆప్ట్ సభ్యుడు జగదీశ్వర్రెడ్డి కార్యాలయంపై దాడి చేయగా డిప్యూటీ మేయర్ కె. శివకుమార్ గౌడ్, ఆరుగురు కార్పొరేటర్లు పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి భారీగా నగదు, ప్లే కార్డులు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని విడిచిపెట్టాలని నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వార్త వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.