అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని, తాజాగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సవాలు చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
ఇక ఏపీలో పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స సత్యానారాయన పేర్కొన్నారు. ఏపీ రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ, పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని ఈ సందర్భంగా మంత్రి బొత్స గుర్తు చేశారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను ఎందుకు పట్టించుకోలేదని బొత్స ప్రశ్నించారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని తాము పట్టించుకోమని, అధినేత జగన్ ఆలోచనలే తమకు శిరోధార్యం అని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.