Bomb: ఉత్తర్ప్రదేశ్లో ఫేక్ ప్రచారం సంచలనం రేపింది. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద బాంబు ఉందంటూ అగంతకుల నుంచి అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక దళాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్, సహా ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణంగా పరిశీలించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేసి సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారిక నివాసం వద్ద బాంబు ఉందని తెలిపాడు. దీంతో, వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు నిర్వీర్య స్క్వాడ్తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బాంబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. బాంబు దొరక్కపోయినప్పటికీ పోలీసులు.. సీఎం యోగి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
అయితే గతంలోనూ ఇలానే సీఎం యోగికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలోనూ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. దేశంలోని సెన్సిటివ్ ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ ఒకరు. కాబట్టి ఏ చిన్న సమాచారం ఇలాంటిది వచ్చిన పోలీసులు అత్యంత అప్రమత్తం అవుతారు. ఆయనకు ప్రత్యేక దళాలతోనూ సెక్యూరిటీ ఉంటుంది. కేంద్రం ఈ విషయాలు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంది.