“మీ స్కూల్ లో బలమైన బాంబులు పెట్టాం. వెంటనే వాటిని గుర్తించే ప్రయత్నం ప్రారంభించండి. పోలీసులకు, బాంబు స్క్వాడ్ లకు సమాచారం పంపండి. ఏ మాత్రం ఆలస్యం చేసినా మీతో పాటు వందలాది మంది బాధపడాల్సి వస్తుంది. ఆలస్యం చేయకండి. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది” ఇది తాజాగా బెంగళూరులోని 14 ప్రయివేటు ఇంటర్నేషనల్ స్కూళ్ల కు గుర్తు తెలియని నుంచి వచ్చిన హెచ్చరిక. ఆ పాఠశాలల అధికారిక మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు సందేశాలను ఆగంతకులు ఏప్రిల్ 8న పంపారు. ఆయా పాఠశాలల పేర్లను పోలీసులు తాజాగా ప్రకటించడంతో బెంగళూరులో కలకలం రేగింది.
తమ పిల్లలకు ఏమవుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న బెంగుళూరు పోలీసులు సైబర్ టెర్రరిజం చట్టాల కింద కేసు నమోదు చేశారు. కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా పంపారు. నిందితులను గుర్తించి కటకటాల వెనక్కి నెట్టేదాకా నిద్రపోమని స్పష్టం చేశారు. ఈ బెదిరింపుల ద్వారా సామాజిక అశాంతికి కారణమైన వారికి జీవిత ఖైదు శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు.Abarons.masarfm@gmail.com అనే మెయిల్ ఐడీ నుంచి స్కూళ్లకు బెదిరింపు మెయిల్ లు వచ్చాయని బెంగళూరు ఏసీపీ (ఈస్ట్) సుబ్రమణ్యేశ్వర్ రావు వెల్లడించారు.