హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) శుక్రవారం ఓ బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ రావడం కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ (Airport Administrative Wing) అధికారిక ఈమెయిల్కు వచ్చిన ఈ హెచ్చరికలో “విమానాశ్రయంలో బాంబులు పెట్టాం, ఏ క్షణమైనా పేలుస్తాం” అని చెప్పడమే కాకుండా, ఆ బెదిరింపులకు “పాక్ స్లీపర్ సెల్” బాధ్యత వహించిందని పేర్కొనడం అధికారులు మరింత అప్రమత్తం అయ్యేలా చేసింది. వెంటనే సీఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్, పోలీస్ బలగాలు రంగంలోకి దిగి విమానాశ్రయం మొత్తం, పరిసర ప్రాంతాలను చొప్పిగా తనిఖీ చేశారు.
IPL 2025 Refund: ఐపీఎల్ 2025.. టికెట్ రీఫండ్కి ఎవరు అర్హులు?
విస్తృత తనిఖీలు నిర్వహించిన తరువాత ఎలాంటి బాంబులు లేదా ఇతర ప్రమాదకర పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్పోర్ట్ భద్రత కోసం నియమించిన సీఐఎస్ఎఫ్ బలగాలు నిఘాను మరింత పెంచాయి. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతీ మూలన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగాలు సమన్వయంతో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఇలాంటి బెదిరింపులపై అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? అన్న విషయాలపై సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ శాఖలు దర్యాప్తు చేపట్టాయి. ఈ ఘటనతో విమానాశ్రయం భద్రతపై మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనల పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.