TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠత

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 02:23 PM IST

TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించింది బీజేపీ. అదే జోష్‎ను లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి 16లోపే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల నుంచి బరిలో దిగేందుకు ఈ అభ్యర్థులు సిద్దంగా ఉన్నారు.సికింద్రాబాద్‌ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్ పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు.

అలాగే నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ పోటీ చేయాలని భావిస్తున్నారు. మల్కాజిగిరి టికెట్‌ కోసం మురళీధర్ రావు, ఈటెల రాజేందర్ పేర్లు పరిశీలిస్తున్నారు. మల్కాజ్‌గిరి, మెదక్, హైదరాబాద్ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి.మహబూబాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో కాంగ్రెస్ నేతలను చేర్చుకుని టికెట్ ఇచ్చే యోచనలో కమలం పార్టీ ఉంది.

నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్.. అభ్యర్థుల కోసం బీఆర్‌ఎస్‌ నేతలపై కాషాయ పార్టీ కన్నేసింది. ఖమ్మం, నల్గొండలలో బయటి నుంచి వచ్చిన వారికే అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఫిబ్రవరి 10 నుంచి 16లోపే అభ్యర్థుల తుది జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది