తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి (BRS Candidates List) ఎన్నికలకు సిద్ధమైంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం దరఖాస్తుల స్వీకరణ చేస్తూ సిద్ధం అవుతుంది. మరి బిజెపి పరిస్థితి ఏంటి..? అనేది ఇప్పుడు అర్ధం కానీ పరిస్థితి. రెండు నెలల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికార పార్టీ (BRS)కి ఎదురు నిలిచే పార్టీ బిజెపినే అని అనుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా అనేక మార్పులు జరిగాయి.
గతంలో బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్, ఈటల, కోమటిరెడ్డి మధ్య తీవ్రమైన అంతర్గత పోరు కొనసాగింది. అనుహ్య పరిణామాల రీత్య ఆయన్ను మార్చడంతో అంతర్గత విభేదాలు సద్దుమణిగిందని భావించారు. కానీ ఇప్పుడు అసలుకే మోసం వస్తుంది. బీజేపీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో గెలవడం కష్టమని.. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుదామని కార్యకర్తలు..నేతలపై ఒత్తిడి తెస్తున్నారట. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల సమయం ఉండటంతో బీఆర్ఎస్ను ఎదుర్కొవడం బీజేపీకి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈటల (Etela Rajender) గ్రామల్లో పర్యటిస్తుండగా.. స్థానిక కార్యకర్తలు అత్యధిక మంది కార్యకర్తలు కాంగ్రెస్లోకి పోవాలని డిమాండ్ చేస్తున్నారట. హుజురాబాద్ నియోజకవర్గంలోని మండలాల కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోకుంటానని కమలాపురం కార్యకర్తలకు ఈటల చెప్పారట. అలాగే మునుగోడు నియోజవర్గంలో కోమటిరెడ్డి అనుచరులు కూడా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళదామని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క వివేక్ ను సైతం కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారట. ఇలా మొత్తం మీద బిజెపి నేతలపై ఒత్తిడి పెరుగుతుండడం తో ఒకవేళ నిజంగా వీరంతా బిజెపి ని వీడి కాంగ్రెస్ లో చేరితే రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు పెరుగుతుంది..ఇక ఇప్పుడు బిజెపి సీనియర్ నేతలంతా కాంగ్రెస్ లో చేరితే..కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమే అని అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగా ఈటెల , వివేక్ , కోమటిరెడ్డి లు కాంగ్రెస్ లో చేరతారా..? లేదా అనేది చూడాలి.