అమెరికాలోని టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐదురోజుల ఆసియా పర్యటనను ముగించకుని వైట్ హౌస్ చేరిన కొద్దిసేపటికే ఆయన కాల్పుల ఘటనపై స్పందించారు. ఆ భగవంతుడి దయతో దేశంలో తుపాకీ సంస్కృతి ఎప్పుడు అంతమవుతుందో…మనం తుపాకీ లాబీకి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడుతామో..అని అన్నారు. ఇలాంటి ఘటనలు కలిచి వేస్తున్నాయని వాటిని చూసి విని అలసిపోయానని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచంలో ఇలాంటి ఘటనలు జరగడం అరుదని…అమెరికాలో మాత్రం ఎందుకు తరచు జరుగుతున్నాయోనని విచారం వ్యక్తం చేశారు బైడెన్. శనివారం సాయంత్రం వరకు జెండాలను అవతనం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఈ ఘటనపై కమలా హారీస్ స్పందించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గుండెలు తరుక్కుపోతున్నాయాని…కానీ ప్రతిసారీ తమ గుండెలు తరుక్కుపోతూనే ఉన్నాయన్నారు. బాధితుల కుటుంబాల గుండెలతోపోలిస్తే..తరుక్కుపోయిన మన గుండెల బాధ తక్కువేనన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవడానికి ధైర్యం చాలా అవసరమన్నారు.