తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేడు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. తప్పిదాలకు పాల్పడి పాపాత్ములు అనిపించుకోవద్దని, ఎల్లవేళలా ఇతరుల పట్ల సానుభూతి, దయతో వ్యవహరించి సాయపడదామని పేర్కొన్నారు.
ఇటీవల అసెంబ్లీ లో వల్లభనేని వంశీ అన్న మాటలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా స్పందిస్తూ.. ఇతరుల వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని భువనేశ్వరి స్పష్టం చేశారు. వీటిని పట్టించుకుంటూ పోతే సమయం వృథా అన్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన 48 మందికి సాయం అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు.