బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఓ జంటకు విచిత్ర అనుభవం ఎదురైంది. అది ఎంత భయానకంగా ఉందో బాధితుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పోలీసులే ఇలా చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఇలాంటి అనుభవం ఇంకెవరికీ జరగకూడదని చెప్పాడు. అర్ధరాత్రి కావడంతో చేసేదేమీ లేక ఆ ఇద్దరు పోలీసులు చెప్పినట్లు చేయక తప్పలేదని వాపోయాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోండి..
బెంగళూరు నగరంలో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ జంట తమ స్నేహితుడి బర్త్ డే వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇంటికి సమీపంలోకి వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్న ఈ జంటను ఇద్దరు పోలీసులు ఆపారు. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. స్నేహితుడి పుట్టిన రోజు కేక్ కట్ చేసే కార్యక్రమానికి హాజరై వస్తున్నామని సమాధానమిచ్చారు.
అయితే, తర్వాత ఆధారాలు అడిగారు. ఐడీ కార్డులు చూపమన్నారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా టార్చర్ చేయడం మొదలు పెట్టారు. రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగడం నిషేధం అని దురుసుగా ప్రవర్తించారు. ఆ సమయంలో వాదన అనవసరమని భావించిన సదరు జంట.. వారు అడిగిన అన్నింటికీ జవాబు ఇచ్చారు. ఎంత ఓపిగా వ్యవహరించినా వారు వినలేదు.
పేటీఎం ద్వారా మూడు వేలు ట్రాన్స్ఫర్..
తన భార్య ప్రాధేయపడినా, ఏడ్చినా ఆ ఇద్దరు పోలీసులూ కనికరించలేదని, ఐడీ కార్డులు, ఫోన్ లాగేసుకున్నారంటూ బాధితుడు కార్తీక్ పత్రి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. దీంతోపాటు ఈ విషయాన్నంతా బెంగళూరు సిటీ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు బాధితుడు. తాను పేటీయం ద్వారా మూడు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేదాకా ఆ ఇద్దరు పోలీసులు వదల్లేదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్.. ముందుగా బాధితుడిని అభినందించారు. ఈ విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.