Site icon HashtagU Telugu

IND vs AUS 3rd ODI: చివరి మ్యాచ్ లో ఆసీస్ విజయం

India-Australia

India-Australia

IND vs AUS 3rd ODI: సన్నాహక సిరీస్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా బోణి కొట్టింది. మూడు వన్డేల మ్యాచ్ లో చివరి మ్యాచ్ లో టీమిండియాను 66 పరుగుల తేడాతో ఓడించింది. రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. చివరి వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 352 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే 286 పరుగులకే కుప్పకూలింది. మూడో వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కంగారూ జట్టు తరఫున గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించి 4 వికెట్లు పడగొట్టాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 భారీ స్కోర్ చేసింది. ట్టులో ఓపెనర్ వార్నర్(56), మిచెల్ మార్ష్(96), స్టీవ్ స్మిత్(74), లబూషేన్(72) పరుగులతో రాణించారు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. సిరాజ్-ప్రసిద్ధి చెరో వికెట్ పడగొట్టారు.

353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్-సుందర్ లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్(18) ను మాక్స్ వెల్ అవుట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ ఆసీస్ బౌరల్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న రోహిత్ శర్మకు మాక్స్ వెల్ బ్రేకులు వేశాడు. అద్భుతమైన క్యాచ్ తో అవుట్ చేశాడు. 21వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ గ్లెన్ మాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చాడు. ఇక 171 పరుగుల వద్ద కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (26) కాసేపు ఫర్వాలేదనిపించారు. అయితే కొద్దిసేపటికే అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 257 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి అంచుకు చేరింది. మిగతా మూడు వికెట్లను తీయడానికి ఆసీస్ ఎక్కువ సమయం తీసుకోలేదు. 49.4 ఓవర్లలో 286 పరుగులకు భారత్‌ను ఆలౌట్ చేసింది.

Also Read: Bubble Gum : బబుల్ గమ్స్‌ని తినడం వలన లాభమా లేక నష్టమా?