కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి 350 కుక్కలు చనిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేలటూరు మండలంలోని జగదేవ్ పేట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో వీధి కుక్కలు తిరుగాడుతున్నాయని, కుక్కలు సంచరిస్తుండటంతో గ్రామస్తులు కొందరు గ్రామపంచాయతీకి ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ అధికారులు డాక్టర్ల సాయంతో ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారు. కేవలం 2 నిమిషాల్లోనే కుక్కలు చనిపోయాయి. అక్కడితో ఆగిపోకుండా గ్రామం నుండి మరిన్ని కుక్కలను చంపడానికి వ్యాను వచ్చింది.
ఈ ఘటనపై జంతు ప్రేమికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ రంగంలోకి దిగి కుక్కలను చంపొద్దని హెచ్చరించారు. పిసిఎ యాక్ట్ 1960 మరియు ఎబిసి రూల్స్ (డాగ్స్) 2001 ప్రకారం కుక్కలను చంపడం చట్టవిరుద్ధమని, పిసిఎ యాక్ట్ సెక్షన్ 11(1)(ఎల్) ప్రకారం పంచాయత్ సెక్రటరీ, పంచాయితీ సిబ్బంది, కాంట్రాక్టు పొందినవాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.