ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ పోలీసులు అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అశోక్ బాబు అరెస్ట్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయని అచ్చెన్నాయుడు అన్నారు.
ఇక అధికార పార్టీ అయితే వైసీపీ వైఫల్యాలను, ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో అశోక్ బాబు విద్యార్హతలపై వచ్చిన ఆరోపణలపై నిజం లేదని విచారణలో తేలిందని, అయినా జగన్ సర్కార్ కక్షపూరితంగా, అశోక్ బాబును అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. పీఆర్సీ వివాదంలో ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేస్తారన్న ఆగ్రహంతోనే అశోక్ బాబును అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇలాంటి అక్రమ అరెస్ట్లకు టీడీపీ నేతలు భయపడరని, అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.