ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైయ్యారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో విభేదాలు పెరిగిపోవడంతో ఆయన అనుచరులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. వినయ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టిక్కెట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 20 వేల ఓట్లు సాధించారు. ఇది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన నియోజకవర్గంగా ఉంద. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆర్మూర్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 40 వేల ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అరవింద్కు 72 వేల ఓట్లు వచ్చాయి. చివరికి కవిత ఓడిపోవడం, బీజేపీకి ఓట్లు రాబట్టడంలో వినయ్కుమార్రెడ్డి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఆర్మూర్లో 12 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఐదుగురు సర్పంచ్లు, ఒక జడ్పీటీసీ సభ్యులు బీజేపీ అభ్యర్థులుగా గెలుపొందడం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ లేదా కోరుట్ల నుంచి అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వినయ్కుమార్రెడ్డికి సీటు ఉండదనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. త్వరలోనే ఆయన కాంగ్రెస్లో చేరతారని అనుచరులు అంటున్నారు.