TSPSC గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు ఈనెల 11న పరీక్ష నిర్వహిస్తారు. ఇటీవలనే పేపర్ లీకేజ్ వ్యవహరం బయటకు రావడంతో ఈ పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. అయితే పరీక్ష హాల్ లోకి వెళ్లేందుకు 10.15 నిమిషాల వరకే అనుమతిస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తామని తెలిపారు అధికారులు. గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ లో నియమ నిబంధనల్ని స్పష్టంగా పేర్కొన్నారు అధికారులు. సహజంగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు మాత్రమే పావుగంట ముందు గేట్లు క్లోజ్ చేస్తారు. కానీ ఇది ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పరీక్ష అయినా కూడా ముందు జాగ్రత్తగా పావుగంట ముందే పరీక్ష హాల్ లోకి ప్రవేశాలు నిలిపివేస్తామని తెలిపారు అధికారులు. అంటే ఉదయం 10.15 గంటల వరకే లోనికి అనుమతిస్తారు. సరిగ్గా 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
ఓఎంఆర్ ఆన్సర్ షీట్ లో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వబోమని చెప్పారు అధికారులు. ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే బబ్లింగ్ చేయాలని సూచించారు. పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగిస్తే ఆ ఆన్సర్ షీట్లు చెల్లుబాటు కావన్నారు. హాల్ టికెట్ తో పాటు ఆధార్ లేదా పాన్, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకు రావాలన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, TSPSC భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని హాల్ టికెట్లలో పొందుపరిచారు.
Also Read: Wrestlers Protest: అమిత్ షాని కలిసిన రెజ్లర్లు… చార్జ్షీటు డిమాండ్