రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారాని, దాదాపు ఎనిమిదేళ్ళకు మరో ముందడుగు పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈక్రమంలో తాజాగా కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం కీలకంగా మారింది. ఈనెల 17వ తేదీన సమావేశానికి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రహోంశాఖ లేఖ రాసింది.
ఇప్పటికే ఈనెల 17న కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో త్రిసభ్య కమిటీని నియమించిన కేంద్ర హోంశాఖ, ఆరోజు చర్చించాల్సిన పలు అంశాలపై అజెండాను రూపొందించింది. సుదీర్ఘకాలం తర్వాత ఏపీ విభజన సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందనే చెప్పాలి. విభజన తర్వా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు నెలకొని ఉన్నా, ఆ సమస్యలకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. కేంద్ర హోంశాఖ పంపిన అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉండడం ఆశ్చర్యం కల్గించినా, ఏపీకి మాత్రం కాస్త ఊరట కలిగించే అంశమే అనుకోవాలి.
