Site icon HashtagU Telugu

AP Property Tax: ఏపీలో బాదుడే బాదుడు.. మళ్లీ 15 పెరిగిన ఆస్తి పన్ను.. వసూళ్ల కోసం కొత్త ప్లాన్!

MLC Result Effect

Jagan Cabinet Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ మీద షాక్ తగులుతోంది. జగన్ సర్కారు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. ఇప్పుడు ఆస్తి పన్నును పట్టణాల్లో మరో 15 శాతం పెంచేసింది. అంటే రెండేళ్లలోనే ఈ పెరుగుదల 32.24 శాతం పెరిగిపోయింది. దీంతో ఈ ఏడాది ప్రజలపై దాదాపు రూ.214 కోట్లకు పైనే భారం పడబోతోంది. అసలే కరోనా దెబ్బకు ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు పడిపోయాయి. దానికి పెట్రో ఉత్పత్తుల భారం పెరగడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు విద్యుత్తు ఛార్జీలు కూడా భారీగా పెరగడంతో సామాన్యుడికి ఊపిరి ఆడని పరిస్థితి.

2021-2022లో కూడా ఆస్తి పన్ను 15 శాతం పెరిగింది. దానిని మున్సిపాల్టీలు గత నెల చివరి వరకు వసూలు చేస్తూనే ఉన్నాయి. దీంతో మధ్యతరగతితోపాటు పేదవారు కూడా ఈ పన్నులను చెల్లించుకోలేక అప్పులు చేయాల్సి వచ్చింది. ఎలాగోలా చెల్లించాములే అనుకునేలోపే మళ్లీ ఇప్పుడు అదనపు పన్నుపోటు తప్పలేదు. ఈమేరకు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో నోటీసులు జారీ చేసి వసూలు చేస్తారు.

పెరిగిన పన్ను పోటు ప్రజలు గుర్తించకుండా ఉండేలా అధికారులు తెలివైన ఐడియా వేశారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ నెలాఖరు లోపే చెల్లిస్తే ఐదు శాతం రిబేట్ ఇస్తామని చెప్పారు. అంటే ప్రజలు ఈ రిబేట్ మోజులో ఉంటారు కనుక పెరిగిన 15 శాతం పన్ను గురించి ఆలోచించరులే అని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పెరిగిన పన్నుకు సంబంధించిన నోటీసులు కూడా ఇంకా జారీ కాలేదు. కేవలం ఆన్ లైన్ లో చూసుకున్నవారికే ఆ సంగతి తెలియడంతో వారు లబోదిబోమంటున్నారు.

ఒక్కసారి పన్నులు చెల్లించేస్తే.. ఇక జనం అలవాటు పడిపోతారులే అని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఎక్కువమంది ఈ రిబేటును ఉపయోగించి ఈ నెలాఖరు లోపే పన్నులు చెల్లించేలా చూడాలని పురపాలక శాఖ కూడా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఒకసారి ఈ అదనపు పన్ను బాదుడు గురించి జనాలకు తెలిస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అన్న ఆలోచనతోనే రిబేటు ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

Photo: File