AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మేలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశానికి లోను కావద్దని అన్నారు.
ఇంటర్ పేపర్ల మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులకు మార్కులపై ఏమైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి 24 వరకూ ఫీజు చెల్లించాలని సూచించారు. అనంతరం ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే, సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ కోసం విద్యార్థులు ఈ నెల 18 నుంచి 24 వరకూ ఫీజు చెల్లించాలని వివరించారు.