ఆన్లైన్ మూవీ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69 అమలుపై స్టే విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్లోనే టిక్కెట్లను విక్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తూ ఏర్పాట్లు చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ థియేటర్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు.. జగన్ సర్కార్కు షాక్ ఇచ్చింది. ఆన్లైన్ సినిమా టిక్కెట్ల విక్రయం, జిఓ 69 నిర్ణయంపై స్టే విధించింది. తదుపరి విచారణను 27వ తేదీకి బుక్ మై షో కేసులో వాయిదా వేసింది. కోర్టుకు మల్టీప్లెక్స్ విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న జీఓ నంబర్ 69ని సవాల్ చేసిన వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు వేసింది.