ఆంధ్రప్రదేశ్లో ఏదో రూపంలో ఉద్యోగులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పోరుబాట పడుతున్నారు. తొలుత ఎన్జీవోలు, టీచర్లు, ఆ తరువాత అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేయగా, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులు ఆ ఆలోచనలో ఉన్నారు. సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, సమ్మె చేయాల్సిన పరిస్థితి రానీయబోమని ప్రభుత్వం చెబుతోంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా వారు ఇకపై కార్మికులు కారని, ఉద్యోగులు అవుతారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. లేబర్కు, ఎంప్లాయీస్కు వర్తించే చట్టాల విషయంలో చిన్న చిన్న తేడాలు ఉండడంతో ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్ వర్తిస్తాయని, అందువల్ల సమ్మె చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.
గతంలో ఆర్టీసీ ఒక కార్పొరేషన్గా ఉండడంతో ఎగ్జిక్యూటివ్ను యాజమాన్యం అనేవారు. ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో ఒక డిపార్టుమెంటుగా మారడంతో ఇక ఎంత మాత్రం మేనేజ్మెంట్గా వ్యవహరించకూడదని అధికారులు అంటున్నారు. అంటే ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఆర్టీసీ వ్యవహారాలు నడుస్తాయి. అందువల్ల గతంలో మాదిరిగా ఉద్యమాలు చేసేందుకు వారు కార్మికులు కారు.. తాము యాజమాన్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కేడర్, పే స్కేలును ఖరారు చేస్తున్నామని, అందువల్ల ఈ దశలో సమ్మె వద్దని కూడా నచ్చజెప్పారు. ప్రభుత్వంలో మెర్జ్ కావడం వల్ల అడిషినల్ బెనిఫిట్స్ కలగకపోగా, కొన్ని సందర్భాల్లో ఉన్నవి కోల్పోయామని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. వీటి సాధనకు సమ్మె తప్ప మరో దారి లేదని అంటున్నారు.