ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో ప్రజారంజక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో… తక్కువ ధరకు మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్ ను (ఎంఐజీ-మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ లేఔట్లు) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తొలుత ఐదు జిల్లాల్లో భూములను సమీకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న అనంతపురం, కడప, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో తొలి దశలో లేఔట్లు అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని చోట్ల ప్రైవేట్ భూములను ప్రభుత్వ ధరకంటే 5 రెట్లకు మించకుండా సేకరించనున్నారు.