ఏపీలోని పదవతరగతి పరీక్షా ఫలితాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు జగన్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవిడ్ వల్ల విద్యార్థులు 8, 9 తరగతుల పరీక్షలు రాయకుండానే డైరెక్టుగా 10వతరగతి పరీక్షలు రాశారన్నారు. అయినప్పటికీ 67శాతం మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. గుజరాత్ లో 65శాతంమంది మాత్రమే పాస్ అయినట్లు తెలిపారు జగన్. ఫెయిల్ అయినవారికి నెలరోజుల్లోనే సంప్లిమెంటరీ పరీక్షలు పెడతామని…అందులో పాసైనా కంపార్ట్మెంటల్ కాకుండా రెగ్యులర్ గానే పరిగణిస్తామని చెప్పినా కూడా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు సీఎం జగన్ .
చదువులో క్వాలిటీ ఉండేందుకు ఎన్నో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి…విద్యార్థులను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందానా అంటున్నాడని సెటైర్లు వేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు ఏకమై ఉన్నది లేనట్లుగా…లేనిది ఉన్నట్లుగా చెబుతున్నారని..మోసం చేయడంలో చంద్రబాబు దత్తపుత్రుడు తోడుదొంగలని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అసలు అర్హులేనా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్.