ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అనేది ఒక పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, నిధులు గురించి చర్చించడం చూసి ఓర్వలేక చంద్రబాబు ఏదోదో మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లు అమరావతి అనేది లేదని.. కేవలం అది భ్రమరావతి మాత్రమేనన్నారు. గ్రాఫిక్స్ లో చూపించినట్టు అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్లు లేవని.. కనీసం డ్రైనేజ్, తాగునీరు సదుపాయాలు, ఐఏఎస్, ఐపీఎస్లకు ఇస్తామన్న క్వార్టర్స్కు అతిగతీ లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు చెప్పడం చాలా బాధాకరమైన విషయమని.. ప్రెస్మీట్లో చాలెంజ్లు చేస్తూ ఏవో చంద్రబాబు మాట్లాడుతున్నారని.. రూ.10వేల కోట్లు తో ఒక్కటీ పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. ఏ ఒక్కటీ పూర్తి చేయకపోగా మాయమాటలు చెబుతున్నారని.. కనీసం సొంత ఇల్లు కూడా చంద్రబాబుకట్టుకోలేకపోయారన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీచేస్తానని చంద్రబాబు ప్రకటించగలడా? అని ఆయన ప్రశ్నించారు.