ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు మార్చి 4వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయిస్తారని సమాచారం. అయితే ఈసారి కనీసం ఎనిమిది నుండి పది రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది.
ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన అనంతరం, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, మూడు రాజధానుల కొత్త బిల్లుల పై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కీలక బిల్లులు ఆమోదించుకోవడంతో పాటు, రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు, ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. దాదాపు 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తుందని సమాచారం.