కేంద్ర ప్రభుత్వ నిధులతో చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించే లక్ష్యంతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మిస్తున్నారు. శ్రీనివాస సేతు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఫిబ్రవరి తొలి వారంలో ఈ ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.
శ్రీనివాస సేతు తొలిదశలో బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాస వసతి సముదాయం నుంచి కపిల తీర్థం వద్ద ఉన్న నంది సర్కిల్ వరకు సుమారు 3 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. మరోవైపు తిరుపతి బస్టాండు నుంచి తిరుచానూరు హస్తకళారామం వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు రెండో దశ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తిరుపతి స్మార్ట్ సిటీ నిధులను కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. రెండవ దశ పనులు మరో ఆరునెలల్లో పూర్తి కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.